ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఉరుములు, పిడుగులతో ముంచెత్తనున్న వానలు
- తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి చల్లబడనున్న వాతావరణం
- రెండు రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచన
- హైదరాబాద్లో రాత్రి పూట మారనున్న వాతావరణం
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే రుతుపవనాలు ఎంట్రీ ఇచ్చినా, అక్కడక్కడ మాత్రమే వర్షాలు కురిశాయి.. అయితే, నేటి నుంచి వాతావరణం పూర్తిగా చల్లబడనుందని, ఇరు రాష్ట్రాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఏపీలోని ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలపై వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండబోతోంది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, విశాఖపట్నం, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వానలు కురుస్తాయి.
తెలంగాణలో నేడు ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా సెంట్రల్, దక్షిణ తెలంగాణ జిల్లాలపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మెదక్, సిద్దిపేట్, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, నారాయణ్ పేట్, నల్గొండ, యాదాద్రి భువనగిరి, జనగాం, కామారెడ్డి జిల్లాల్లో సాయంత్రం నుండి అర్ధరాత్రి సమయంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
హైదరాబాద్లో కూడా పగటిపూట ఎండ ఉన్నప్పటికీ.. రాత్రి సమయంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయి ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు పడే ముప్పు ఉందని వెదర్ రిపోర్ట్స్ చెబుతున్నాయి.